Friday, August 10, 2007

సినీవనంలో మోనికాలెందరో...?

సినీ పరిశ్రమ...రంగులలోకం...ఎందరో యువతీ యువకుల కలల ప్రపంచం. ఒక్కసారైనా సినిమాల్లో నటించాలనే కోరిక చాలామంది యువతలో ఉంటుంది. దానికి కారణం సినీ ఫీల్డ్ కున్న గ్లామర్ మరే ఫీల్డ్ కు లేకపోవడమే. లక్కు బాగుంటే రాత్రికి రాత్రే స్టార్ ఐపోవచ్చనే ఆశనే యువతని అటువైపు అడుగులు వేయిస్తోంది. అతి తొందరగా ఎక్కువ పేరు ప్రఖ్యాతలు వచ్చేది కూడా ఆ రంగంలోనే. అయినా ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే రెండోవైపు చూస్తే ఎవరైనా సినిమాఛాన్స్ లపై ఆశ వదులుకోవాల్సిందే. ఎందుకంటే సినీరంగంలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. నిలదొక్కుకోవడం మాట అటుంచి, మొదట ఎంట్రీ దొరకడమే వ్యయ ప్రయాసతో కూడుకున్న పని. అది ఎంతలా అంటే అమెరికాలో గ్రీన్ కార్డు దొరకేంత అని చెప్పొచ్చు. సినిమాల్లోకి ప్రవేశించడం ఒక ఎత్తైతే అందులో నిలదొక్కుకోవడం మరో ఎత్తు. అంతో ఇంతో టాలెంట్ ఉన్నా, తెలిసిన వ్యక్తులు ఆ ఫీల్డ్ లో పని చేస్తున్నా ఎన్నో కొన్ని లకారాలు సమర్పించుకోందే పని జరగదు. ఇదంతా మగమహారాజులు సంగతి. ఇక ఆడపడుచుల ఆగచాట్లు ఇంకా దయనీయంగా ఉంటాయి. అందంగా ఉన్నా, నటన తెలిసి ఉన్నా మొదటి అవకాశాలు కోసం మొక్కుబడి తప్పటం లేదు. ఎవరు అవకాశం ఇస్తామన్న నమ్మడం, నమ్మి మోసపోవడం మామూలైపోయింది.అష్టకష్టాలుపడి తెరమీద కొచ్చిన అతివల కథ మరో విధంగా ఉంది. వచ్చిన చిన్న చిన్న అవకాశాలను చేజిక్కుంచుకుని సెటిల్ అయ్యేవరకు వారు ప్రతి వారికి లోబడే ఉండాలి. తీరా కుదురుకున్నాక ఏ బడా పారిశ్రామికవేత్తో, మాఫియా లీడరో, రాజకీయ నాయకుడో కన్నేసినా సదరు నటి తలవంచాల్సిందే. కొందరు నటీమణులు తమకో ఆర్టిస్ట్ తోనో, ప్రోడ్యూసర్, డైరెక్టర్ తోనో ప్రేమలో కూరుకుపోతుండగా, మరికొందరు బెదిరింపుల వల్ల లొంగిపోతున్నారు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గిలిగింతలు పెట్టి అశేష అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటి దివ్యభారతి మృతి ఉదంతం అప్పట్లో ఓ సంచలనం. అది హత్యా..? ఆత్మహత్యా? అనేది ఇప్పటికి ముగింపులేని సస్పెన్స్ సినిమానే మిగిలిపోయింది. ఇక తెలుగులో పాటు వివిధ భాషలలో వ్యాంప్ క్యారెక్టర్లు పోషించిన సిల్క్ స్మిత చనిపోయిన మర్డర్ మిస్టరీ కూడా అ౦తే. వీర౦తా చనిపోయినవారు. ఇక బతికుండి నరకం అనుభవిస్తున్న నటీమణులు కూడా ఉన్నారు. ఇది మన టాలీవుడ్ కంటే బాలివుడ్ చిత్ర పరిశ్రమలోనే అధికమని చెప్పొచ్చు. అక్కడ మాఫియా బాలీవుడ్ ని శాసిస్తోంది. అక్కడ మాఫియా అనుమతి లేనిదే యాక్షన్ లు ఉండవు, అంతా పేకప్ లే. అందుకే వారి కనుసన్నల్లోనే షూటింగ్ లు జరుగుతుంటాయి. బాలీవుడ్ లోని సుందరాంగులు కూడా మాఫియా లీడర్లకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే.ఐతే డబ్బు లేదంటే అందానికి గురిపెట్టడం మాఫియా లీడర్లకు గన్నుతో పెట్టిన విద్య. మోనికాబేడీ కూడా ఇందులో ఒక బధితురాలిగా గుర్తించచొచ్చు. నకిలీ పాస్ పోర్టుల కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఈ బాలీవుడ్ భామ ఇప్పుడిప్పుడే ఈ బంధనాల నుంచి బయటపడుతోంది. మాఫియాడాన్ అబూసలెం ప్రియురాలిగా ముద్రపడ్డ మోనికాకు వచ్చిన కష్టాలన్నీ ప్రియుడి నుంచేనన్నది ఓపెన్ సీక్రెట్. ఇక బయట పడనివారి గాథలు కోకొల్లలు. ఏది ఏమైనా రంగుల లోకంలో విహరిద్దామనే వారికి ఇలాంటి సంఘటనలు కనువిప్పు కావాలని కోరుకుందాం..

రచయిత్రి తస్లీమా నస్రీన్ పై జరిగిన దాడి వ్యవహార౦లో నిరసన జ్వాలలు

హైదరాబాద్ లో ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ పై జరిగిన దాడి వ్యవహార౦లో నిరసన జ్వాలలు ఇ౦కా భగ్గు మ౦టూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యాలు నడిపి౦చాల్సిన ఎమ్మెల్యేలు ఓ రచయిత్రిపై దాడికి దిగట౦ హేయనీయమని ప్రొఫిసర్ ఇన్నయ్య వ్యాఖ్యాని౦చారు. ఇది ఖచ్చిత౦గా ప్రజాస్వామ్య విలువలను మ౦టకలపడమేనన్నారు. తస్లీమా రచనలను తెలుగులోకి అనువది౦చిన వెనిగళ్ల కోమలి కూడా దాడిని ఖ౦డి౦చారు. రచనల ద్వారా స్త్రీ, పురుష సమానత్వ౦ కోస౦ పోరాడుతున్న తస్లీమాపై దాడికి దిగట౦ ద్వారా ఎమ్మెల్యేలు తమ విలువలను దిగజార్చుకు౦టున్నారని ఆమె విమర్శి౦చారు.

తస్లీమా నస్రీన్పై దాడి చేసి ప్రెస్ క్లబ్ లో విధ్వంసం సృష్టించిన ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై చర్య తీసుకోవాలని ఎలక్ట్రానికి మీడియా జర్నలిస్టులు, కెమరామెన్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఎంఐఎం చర్యకు నిరసనగా హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టులు ఆ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ నుంచి సచివాలయం వరకు ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి జానారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యేలపై హత్యయత్నం కేసు నమోదు చేయాలని ప్రెస్ క్లబ్ పై దాడి చేయడం మీడియాపై దాడి చేయడమేనని, ఈ ఘటనపై ఎంఐఎం బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆ పార్టీ కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని హూమంత్రి జానారెడ్డి హామీ ఇచ్చారు.
తస్లిమా నస్రీన్ మరోసారి హైదరాబాద్ వస్తే చ౦పుతామని ఎ౦ఐఎ౦ ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ఓవైసీ బహిర౦గ౦గా చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపర౦గా చర్యలు తీసుకు౦టామని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ బల్వి౦దర్ సి౦గ్ తెలిపారు. ఎ౦ఐఎ౦ విషయ౦లో పోలీసులు ఉదాసీన౦గా వ్వవహరిస్తున్నారన్న విమర్షలను కొట్టివేసిన కమీషనర్ ఫిర్యాదులో పేర్కొన్న అ౦శాల ఆధార౦గా అన్ని సెక్షన్ల కి౦ద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

ఐటీ నిపుణుల కలహాల కాపురాలు..!

మా అబ్బాయికి పెళ్ళి చేయాలని చూస్తున్నాం.. మా వాడి జీతం మాటకొస్తే యాభై వేలకు పైమాటే,,!!ఇక అమ్మాయి కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తే బాగుంటుందన్నది మా అభిప్రాయం.. కాపురానికి కావాల్సిన డబ్బులు కాస్త ఆదా చేసుకోవచ్చు..పై పెచ్చు సేవింగ్స్ కూడా చేయచ్చు కదా?? ఏమంటారు?? ఇది ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల తల్లిదండ్రుల మాట.. అయితే, జీతం బాగుంటే జీవితం బాగుంటుందనుకోవడం పొరపాటే..ఎందుకంటే ఎంత ఎక్కువ జీతం వస్తే అంత ఆందోళన ఎక్కువవుతుందన్నది తాజా సర్వేల్లో తేలిన నిజం. మరోవైపు వీరి వైవాహిక జీవితాలు కూడా ఏమాత్రం సాఫీగా సాగడంలేదన్నది తాజా అధ్యయనాల సారాంశం. ఇలాంటి కేసులు చెన్నైలో మరింత ఎక్కువగా ఉన్నాయట.. చెన్నైలోని ఫ్యామిలీకోర్టుల్లో దాఖలైన మొత్తం విడాకుల కేసుల్లో ఏకంగా 40 శాతం ఐటీ, బీపీవో రంగాలకు చెందినవారివే కావడం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. గత సంవత్సరం చెన్నైలో దాఖలైన మొత్తం విడాకుల కేసులు 3000 కాగా, ఈ ఏడాది జూన్ నాటికే ఈ సంఖ్య దాటేసింది. వీటిలో ఎక్కువభాగం ఐటీ ఉద్యోగులవే. కొన్నేళ్ల క్రితం వరకూ ఖాళీగా కనిపించిన ఫ్యామిలీ కోర్టులు కూడా ఇప్పుడు కేసులతో కిక్కిరిసిపోతున్నాయి. న్యాయవ్యవస్ధ, చట్టాలపై అవగాహన ఎక్కువవడంతో కలహాల కాపురాలన్నీ ఇప్పుడు కోర్టు గుమ్మంలోకి చేరుతున్నాయి. మరోవైపు ఇలాంటి కేసులతోనే తమను ఎక్కువమంది ఆశ్రయిస్తున్నారని చెన్నైలోని డాక్టర్లు చెబుతున్నారు. "ఐటీ ఉద్యోగమంటే బుర్రతో పని,దీని ప్రభావం వైవాహిక జీవితంపై పడుతుంది. మానసికంగా అలిసిపోవడం వల్ల శృంగారంలో ఆసక్తి, సామర్ధ్యం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు పెటాకులవ్వడానికి ఇది కూడా ఒక కారణం, ఐటీ ప్రొఫెషనల్స్ 28 ఏళ్ళు వచ్చేసరికి హైపర్ సెన్సిటివ్ గా తయారవుతున్నారు. ఇక 35 ఏళ్ళు వచ్చేసరికి మానసికంగా పూర్తిగా అలసిపోతున్నారన్నది వారి వాదన. పని ఒత్తిడి, అహం, భార్యాభర్తలు ఎక్కువసేపు విడివిడిగా ఉండటం, సహోద్యోగుల సాన్నిహిత్యం ఎక్కువవడం, ఐటీ ఉద్యోగాల్లో ఇవే విడాకులకు ఎక్కువగా కారణాలవుతున్నాయి. వీరిలో 99 శాతం మంది పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో వివాహాన్ని వారు కేవలం సౌకర్యంగానే భావిస్తున్నారని లాయర్లు కూడా చెబుతున్నారు. అయితే, ఈ సమస్యలను అధిగమించడానికి ఐటీ, బీపీఓ కంపెనీలు వారి వారి కార్యాలయ ఆవరణల్లో కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. దీంతో కొంతవరకూ ఈ సమస్య తగ్గే అవకాశం ఉంది. మరి మీరు కూడ ఐటీ ప్రొఫెషనల్ ఆ? జాగ్రత్తగా ఉండండి.. పని ఒత్తిడి మీ వైవాహిక, కుటుంబ జీవనాలపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది. కాస్తంత సమయాన్ని కుటుంబసభ్యులతో కేటాయించడనికి ప్రయత్నించండి.. ఆదివారం సాయంత్రం ఏ షికారుకో.. సినిమాకో...

ఎట్టకేలకు పట్టుబడిన పటోళ్ల

అనేక హత్యకేసులతో సంబంధమున్న పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు అనుచరుడు విష్ణును కూడా అరెస్ట్ చేశారు. పటోళ్లను పట్టుకొవడానికి చాలా కాలం నుంచి ఇటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 1990లో విప్లవ దేశభక్త పులులు(ఆర్.పీ.టీ) పేరుతో పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ఓ ముఠాను ఏర్పాటు చేసి కళ్లు దుకాణాలు, సిండికెట్ల వద్ద వసూళ్లతో నేర ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఇవే కాకుండా అనేక కిడ్నాప్ కేసులతోనూ బెదిరింపు కెసులతోనూ అతనికి సంబంధంవుంది. 2006 జూన్ లో దిల్ షుఖ్ నగర్ విశ్వం స్కూల్ యజమాని, రియల్టర్ నాగేశ్వరావు హత్య, మలక్ పేట్ పరిధిలో జరిగిన పార్శిల్ బాంబ్ పేలుడు వంటి సంఘటనలతో పటోళ్లకు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అర్నెళ్ల క్రితం అరెస్టయిన పటోళ్ల అనుచరుల సహాయంతో అతన్ని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు.